చెన్నై: డీఎంకే ఎంపీ కదిర్ ఆనంద్(DMK MP Kadir Anand)కు చెందిన కళాశాలలో జరిపిన తనిఖీల్లో రూ.13.7 కోట్లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. మంత్రి దురైమురుగన్ కుమారుడు, వేలూరు ఎంపీ కదిర్ ఆనంద్(Minister Duraimurugan’s son and Vellore MP Kadir Anand)కు చెందిన ఇంజనీరింగ్ కళాశాలలో రెండు రోజుల క్రితం ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు.
మంత్రి దురైమురుగన్ ఇల్లు, మంత్రి ప్రధాన అనుచరుడు, డీఎంకే ప్రముఖుడు పూంజోలై శ్రీనివాసన్, ఆయన బంధువు దామోదరనప్ తదితరుల ఇళ్లలోను తనిఖీలు జరిగాయి. మూడు రోజులు జరిగిన ఈ తనిఖీల్లో, డిజిటల్ నగదు పరివర్తన, కార్యాలయంలోని ఫైళ్లు, కంప్యూటర్ సమాచారం, కళాశాలలో నగదు భద్రపరిచే గది సహా పలు ప్రాంతాల్లో అధికారులు తనిఖీలు జరిపారు. తనిఖీల్లో లభ్యమైన ఆధారాలు, పత్రాల విషయమై ఈడీ ఎలాంటి ప్రకటన చేయలేదు.
తాజాగా మంగళవారం వెల్లడైన సమాచారం మేరకు, ఎంపీ కదిర్ ఆనంద్ కళాశాల నుంచి రూ.13.7 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. అలాగే, ఎంపీ ఇంట్లో లాకర్ బద్దలుకొట్టి రూ.75 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. కళాశాల నుంచి హార్డ్ డిస్క్, ఆస్తులకు సంబంధించిన దస్తావేజులు లభ్యమయ్యాయి. ఆ పత్రాలు పరిశీలిన్నట్లు, కంప్యూటర్లో నమోదుచేసిన వివరాలు కూడా పరిశీలిస్తున్నట్లు ఈడీ అధికారులు పేర్కొన్నారు.
