న్యూఢిల్లీ: దశాబ్దాలుగా భద్రతా బలగాలకు చిక్కకుండా ముప్పతిప్పలు పెట్టిన మావోయిస్టు అగ్రనేత, సెంట్రల్ కమిటీలో కీలక సభ్యుడు చలపతి (Chalaapati) అలియాస్ జయరాం రెడ్డి ఎట్టకేలకు ఛత్తీస్గఢ్-ఒడిసా సరిహద్దులో గత వారం జరిగిన ఎన్కౌంటర్లో మరణించాడు. ఈ ఎన్కౌంటర్లో 20 మందికి పైగా మావోయిస్టులు హతం కావడం, ముఖ్యంగా రూ.కోటి రివార్డు ఉన్న అగ్రనేత చలపతి మరణించడంతో ఇది భద్రతా దళాల కీలక విజయమైంది. చలపతిని భద్రతా దళాలు ఎలా గుర్తించారు? అందుకు ఉపకరించిన కీలక ఆధారం ఏమిటి? చలపతి తన భార్య అరుణ అలియాస్ చైతన్య వెంకట్ రవితో సెల్ఫీ తీసుకోవడమే ఆయన కొంపముంచిందని, అందుకు మూల్యంగా ఆయన ప్రాణాలు కోల్పోయారని తెలిసింది. ఆంధ్ర ఒడిశా బోర్డర్ స్పెషల్ జోనల్ కమిటీ (ఓవోబీఎస్జడ్సీ) డిప్యూటీ కమాండర్గా అరుణ ఉంది.
ఆంధ్రప్రదేశ్లో 2016 మేలో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ఆ ఎన్కౌంటర్ తర్వాత ఒక స్మార్ట్ఫోన్ను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. అందులో చలపతి తన భార్య అరుణతో తీసుకున్న సెల్ఫీ కనబడింది. ఈ సెల్ఫీనే భద్రతా దళాలు చలపతిని గుర్తించడానికి సాయపడింది. చిత్తూరు జిల్లాకు చెందిన చలపతి ఛత్తీస్గఢ్లోని బస్తర్లో ప్రధానంగా తన కార్యకలాపాలు సాగుస్తూ వస్తున్నారు. అయితే బస్తర్లో ఇటీవల తరచు ఎన్కౌంటర్లు జరుగుతుండటంతో సేఫర్ ఆపరేషనల్ జోన్గా ఒడిశా సరహద్దు సమీపానికి ఆయన షిప్ట్ అయ్యారు. మిలటరీ తరహా వ్యూహాలు, గెరిల్లా యుద్ధతంత్రంలో చలపతి నేర్పరని అధికారులు తెలిపారు. ఒడిశాలోని నయాగఢ్ జిల్లాలో 2008 ఫిబ్రవరిలో జరిగిన కీలక దాడి వెనుక చలపతి ప్రధాన సూత్రధారిగా ఉన్నాడు. ఈ దాడి ఘటనలో 13 మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన అనంతరమే చలపతిపై రూ.కోటి రివార్డును ప్రకటించారు.
