హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల (New Ration Cards) కోసం ప్రజలు గ్రామ, వార్డు సభల్లో దరఖాస్తులు చేసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి (జనవరి 21) నుంచి గ్రామసభలు ప్రారంభమయ్యాయి. గ్రామసభల్లో కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజలు భారీగా దరఖాస్తు చేసుకుంటున్నారు. ఈనెల 24 వరకు రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది సర్కార్. ఈనెల 26న రేషన్ కార్డుకు అర్హులైన వారికి రేషన్ కార్డులను జారీ చేయనున్నారు. అయితే గత ఏడాది డిసెంబర్లో ప్రభుత్వం సమగ్ర కులగణన సర్వే నిర్వహించిన విషయం తెలిసిందే.
ఈ సర్వేలో చాలా మంది రేషన్ కార్డులు లేవని ఎన్యూమరేటర్లకు చెప్పారు. అదే విషయాన్ని పై అధికారులకు తెలిపారు సిబ్బంది. కులగణన సర్వే వివరాలను కూడా కంప్యూటరీకరణ చేశారు. అయితే కులగణన సర్వేలో రేషన్ కార్డు లేని కుటుంబాలను గుర్తించి వారికి రేషన్ కార్డులు జారీ చేస్తారనే ప్రచారం జరిగింది. కానీ.. రేషన్ కార్డు దరఖాస్తుల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. కులగణన సర్వే ఆధారంగా కాకుండా గ్రామ సభల్లో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు. గ్రామ సభల్లో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులకు కార్డులను జారీ చేయనున్నట్లు తెలుస్తోంది.
గ్రామ సభల్లోనే…
సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా రూపొందించిన జాబితాలో పేర్లు లేని కుటుంబాలు ఈ నెల 24 వరకు జరిగే స్థానిక వార్డు సభల్లో దరఖాస్తులు సమర్పించవచ్చని ఇప్పటికే మంత్రులు ప్రకటించారు. గ్రామసభల్లో రేషన్కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే రేషన్ కార్డులు జారీ చేసే అవకాశం ఉంది. సమగ్ర కుటుంబ సర్వేలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసినప్పటికీ గ్రామసభల్లోనూ మరోసారి దరఖాస్తు చేసుకోవాల్సిందే. అయితే సమగ్ర ఇంటింటి సర్వేలో రేషన్ కార్డు లేని కుటుంబాల గుర్తింపు అంతంత మాత్రంగానే కొనసాగిందనే వార్తలు వచ్చాయి. ప్రజాపాలనలో కొత్త రేషన్ కార్డుల కోసం దాదాపు 5,73,069 కుటుంబాలు దరఖాస్తు చేసుకోగా.. సమగ్ర కుటుంబ సర్వేలో మాత్రం 83,285 కుటుంబాలను గుర్తించడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ క్రమంలో కులగణన ప్రాతిపదకన కాకుండా ప్రస్తుతం కొత్త రేషన్ కార్డు కోసం గ్రామ సభల్లో దరఖాస్తు చేసుకోవాలని మంత్రులు, అధికారులు చెబుతున్నారు.
నిరంతర ప్రక్రియ…
నూతన రేషన్కార్డు కోసం, కుటుంబ సభ్యుల పేర్లు చేర్చేందుకు వార్డు సభల్లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. రేషన్ కార్డు కోసం చేసుకున్న దరఖాస్తులను అధికారులు పరిశీలించి వాటిలో అర్హులైన వారిని గుర్తిస్తారు. అర్హులైన ప్రతీఒక్కరికీ రేషన్ కార్డులను జారీ చేస్తామని మంత్రులు ఇప్పటికే స్పష్టం చేశారు. మరోవైపు కొత్త రేషన్ కార్డుల కోసం రాష్ట్రవ్యాప్తంగా 11,65,052 మందికి సంబంధించిన 6,68,309 కార్డుల సమాచారం ఇప్పటికే సిద్ధమైనట్లు సీఎస్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పదేళ్ల తరువాత రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తోంది సర్కార్. ప్రజాపాలనలో దరఖాస్తున్న చేసుకున్న వారిలో అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని మంత్రులు ఇప్పటికే స్పష్టం చేశారు.
