న్యూఢిల్లీ: అగ్రదేశం అమెరికాకు రెండవసారి అధ్యక్షుడుగా డొనాల్డ్ ట్రంప్ (Donald Trumph) మరికొద్ది గంటల్లో ప్రమాణస్వీకారం చేయనున్నారు. భారత్ తరఫున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక దూతగా కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ (S.Jaishankar) ఈ ప్రమాణస్వీకారానికి హాజరవుతున్నారు. ట్రంప్కు శుభాభినందలు తెలుపుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) రాసిన లేఖను స్వయంగా ఆయనకు జైశంకర్ అందజేయనున్నారు.
గతంలో దేశాధినేతల ప్రమాణస్వీకారానికి తమ ప్రత్యేక దూతలను భారత్ పంపిన సందర్భాలు చాలానే ఉన్నాయి. 2023 మేలో నైజీరియా అధ్యక్షుడి ప్రమాణ స్వీకారానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరయ్యారు. 2023 నవంబర్లో మాల్దీవుల అధ్యక్షుడి ప్రమాణ స్వీకారానికి అప్పటి కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు హాజరయ్యారు.
గత ఏడాది జూలైలో ఇరాన్ అధ్యక్షుడి ప్రమాణస్వీకారానికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి, ఇండోనియా అధ్యక్షుడు ప్రమాణస్వీకారానికి, 2024 అక్టోబర్లో మెక్సికో అధ్యక్షుడి ప్రమాణస్వీకారానికి విదేశాంగ శాఖ సహాయ మంత్రి పవిత్ర మార్గెరిట హాజరయ్యారు. 2022 జూన్లో ఫిలిప్పీన్ అధ్యక్షుడి ప్రమాణస్వీకారానికి విదేశాంగ శాఖ సహాయ మంత్రి రాజ్ కుమార్ రంజన్ సింగ్ వెళ్లారు.
